ఉక్రెయిన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన హ్యాకర్లు.. రష్యాపై సైబర్ యుద్ధం

ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాను కట్టడి చేయడానికి అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా, ఈ దాడికి వ్యతిరేకంగా రష్యాపై సైబర్ యుద్ధాన్ని ఓ హ్యాకర్ గ్రూప్ ప్రారంభించింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ‘సైబర్ వార్’ ప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసానికి ప్రతిస్పందనగా తాము పదుల కొద్దీ రష్యన్ వెబ్‌సైట్‌లను హ్యాక్‌ చేసినట్లు ‘అనానమస్‌’ గ్రూప్‌ పేరిట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి. మరోవైపు తమ ప్రభుత్వంతోపాటు క్రెమ్లిన్, డూమా, రక్షణశాఖ వెబ్‌సైట్లు సైబర్‌ దాడికి ప్రభావితమైనట్లు రష్యా ప్రభుత్వ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ఆర్‌టీ ధ్రువీకరించింది. కొన్ని వెబ్‌సైట్‌లు నెమ్మదించగా, మరికొన్ని ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయని పేర్కొంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పెద్ద ఎత్తున బాంబు దాడులకు రష్యా సాయుధ బలగాలు సిద్ధమవుతున్నట్లు ‘అనానమస్‌’ ఇటీవల ట్విట్టర్‌లో వెల్లడించింది. అటు, ఉక్రెయిన్‌లో ప్రమాదకరమైన ‘వైపర్ మాల్‌వేర్‌’ను గుర్తించినట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ‘ఈఎస్‌ఈటీ’ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మాల్‌వేర్‌ సాయంతో తొలగించిన డేటాను.. తిరిగి పొందడం అసాధ్యమని వెల్లడించారు. సిస్టమ్ రికవరీ టూల్స్‌పైనా ఇది దాడి చేయగలదని చెప్పారు. అయితే, ఈ మాల్‌వేర్‌ దాడికి బాధ్యులెవరో మాత్రం ఈఎస్‌ఈటీ గుర్తించలేకపోయింది. ఈ విషయమై రష్యాపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. సైబర్‌ దాడి ఆరోపణలను ఆ దేశం ఖండించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ‘అనానమస్‌’ అనేది అంతర్జాతీయ హ్యాక్టివిస్ట్‌ (హ్యాకర్లుగా ఉన్న హక్కుల కార్యకర్తలు) ల బృందం. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా వివిధ పెద్ద సైబర్‌ దాడుల వెనుక దీని పాత్ర ఉంది. అమెరికా, ఇజ్రాయేల్, ఉగాండా, టర్కీ తదితర దేశాల ప్రభుత్వ సంస్థలపై దాడి చేసింది. పేపాల్‌, మాస్టర్‌ కార్డ్‌, వీసా, సోనితో సహా అనేక ప్రధాన సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. 2003లో ఆవిర్భవించిన .. ఓ సారి టైమ్స్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలోనూ చోటు దక్కించుకుంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3IfpFjS

Post a Comment

0 Comments