Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 24 September 2020

ముంబై వరద: లిఫ్టులో చిక్కుకొని నీటిలో ఊపిరాడక ఇద్దరి మృతి

ముంబైలో వరద బీభత్సం తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదవశాత్తూ లిఫ్టులో ఇరుక్కుపోయి, వరదనీటిలో మునిగిపోయి ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వారిని కాపాడటానికి అపార్ట్‌మెంట్ వాసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు వృథా అయ్యాయి. కళ్ల ముందే వారు ప్రమాదంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని కాలాపానీ జంక్షన్‌ సమీపంలోని అగ్రిపాద ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ముంబైలోని అగ్రిపాద ప్రాంతంలో 22 అంతస్తుల భవంతి అది. నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాంటి సమయంలో అపార్టుమెంట్‌లో నీటి ట్యాంక్ నింపడానికి మోటార్లను ఆన్ చేయడం కోసం ఇద్దరు సెక్యూరిటీ గార్డులు గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్లారు. సరిగ్గా అదే సమయానికి సెల్లార్‌లోకి వరద నీరు రావడం ప్రారంభమైంది. ప్రమాదాన్ని ఊహించిన సెక్యూరిటీ గార్డులు ప్రాణాలను రక్షించుకునే క్రమంలో లిఫ్టులోకి చేరుకున్నారు. పైఅంతస్తుకు చేరుకోవడానికి ప్రయత్నించారు. కానీ, వరద నీరు చేరడంతో లిఫ్టు మొరాయించింది. అప్పటికే డోర్లు మూసుకుపోయాయి. పైకి వెళ్లడానికి బటన్లు నొక్కినా లిఫ్టు కదల్లేదు. ఇదే సమయంలో లిఫ్టు రంధ్రాల్లోంచి అందులోకి వరద నీరు చేరింది. ఆందోళనతో వాళ్లు ఎమర్జెన్సీ అలారం మోగించారు. అపార్టుమెంట్‌లోని కొంత మంది ఆ అలారం విని పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు. లిఫ్టు డోర్లు తెరిచి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. చూస్తుండగానే అపార్టమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌ను వరద నీరు పూర్తిగా ముంచెత్తింది. అప్పటికే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు అక్కడికి చేరుకుని కట్టర్ సాయంతో లిఫ్ట్‌ను కత్తిరించారు. అందులో చిక్కుకున్న సెక్యూరిటీ గార్డులిద్దరినీ బయటకు తీసుకొచ్చారు. అప్పటికే స్పృహ కోల్పోయిన వారిద్దరినీ హాస్పిటల్‌కు తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. వరద నీటిలో మునిగిపోయిన ఆ ఇద్దరు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని వైద్యులు చెప్పారు. అగ్రిపాదలోని 22 అంతస్తుల నతానీ రెసిడెన్సీ‌ బిల్డింగ్‌లో బుధవారం (సెప్టెంబర్ 23) ఉదయం 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన సెక్యూరిటీ గార్డులు జమీర్ అహ్మద్ సోహనన్ (32), షెహజాద్ మొహమ్మద్ సిద్ధిఖీ మెమన్ (37) చాలా కాలంగా ఆ అపార్టుమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hYRuxh

No comments:

Post a Comment