మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత ఆత్మహత్య వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా.. ఆయన బలవన్మరణానికి చంద్రబాబే ప్రధాన కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ అధినేత తీరుపై వారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా కోడెల ఆత్మహత్య వ్యవహారంలో ఆయన కుమార్తె విజయలక్ష్మీ మరో ట్విస్ట్ ఇచ్చారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నారని.. ఈ విషయంలో తమకు ఎలాంటి అనుమానాలు లేవని ఇప్పటి వరకు చెబుతున్న విజయలక్ష్మీ.. జగన్ సర్కారు వేధింపుల వల్లే తన తండ్రి చనిపోయారంటూ.. బంజారహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ సర్కారు తన తండ్రిపై తప్పుడు కేసులు మోపిందని.. రాజకీయంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోందని ఫిర్యాదులో విజయలక్ష్మీ పేర్కొన్నారు. కోడెలతోపాటు కుటుంబ సభ్యులను ప్రభుత్వం మానసికంగా వేధిస్తోందని.. డిప్రెషన్లోకి వెళ్లిన తన తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. కోడెల భౌతిక కాయాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేట తరలించారు. మంగళవారం రోడ్డు మార్గం ద్వారా గుంటూరు తరలించి.. పార్టీ కార్యకర్తల సందర్శనార్థం గుంటూరు టీడీపీ ఆఫీసులో భౌతిక కాయాన్ని ఉంచారు. అనంతరం నరసరావుపేటకు తరలించారు. బుధవారం కోడెల అంత్యక్రియలు నిర్వహిస్తారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QicxCj
0 Comments