కరెంట్ షాక్‌తో నవవధువు మృతి.. ఆరా తీస్తే దిమ్మదిరిగే షాక్!

డాక్టర్స్.. నా భార్యను కాపాడండి.. 28 ఏళ్ల ఓ యువకుడు చలనం లేకుండా పడి ఉన్న మహిళను హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు. వైద్యులు తక్షణమే స్పందించి ఆ మహిళను పరీక్షించారు. అప్పటికే ఆమె చనిపోయింది. ఆ విషయాన్ని అతడితో చెప్పడానికి కాస్త తటపటాయించారు. చివరికి ముఖం విషాదంగా పెట్టి.. ‘ఇక్కడికి తీసుకొచ్చే లోపే ఆమె కన్నుమూశారు బాబూ..’ అని చెప్పారు. అయ్యో ఘోరం జరిగిందే అంటూ ఆ యువకుడు గుండెలు బాదుకున్నాడు. ఏం జరిగింది బాబూ అనడిగారు డాక్టర్లు. ‘ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టుకున్న లైట్ల వైర్లకు తాకి కరెంట్ షాక్‌కు గురైంది సార్ నా భార్య..’ చెప్పాడతను. ఆ మాటలు వింటూ చనిపోయిన ఆ మహిళకేసి, ఆ వ్యక్తికేసి డాక్టర్లు ఎగాదిగా చూశారు. వాళ్లకు ఎక్కడో తేడా కొట్టింది (అనుమానం రావడానికి బలమైన కారణమే ఉంది). వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం (అతడికి తెలియకుండా) ఇచ్చారు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆ యువకుడి ఇంటికి వెళ్లి అతడిని ప్రశ్నించారు. ‘డెకరేషన్.. లైట్స్.. కరెంట్ షాక్’ అంటూ అదే సీడీ రిపీట్ చేశాడతడు. ఆ తర్వాత పోలీసులు కొంత మంది బంధువులు, ఇరుగు పొరుగు వారిని ప్రశ్నించి మరిన్ని వివరాలు సేకరించారు. అనంతరం ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఈసారి వాళ్ల ప్రత్యేక స్టైల్లో (తమదైన శైలి) అడిగారు.. విషయం చెప్తావా? లేదా.. అని. సీన్ మారిపోయిందిగా. మనోడు అసలు విషయం చెప్పేశాడు. తనే ప్లాన్ చేసి మరీ తన భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. అంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చిందో కూడా వివరించాడు పాపం. అతడి పేరు అరుణ్ కుమార్. ఊరు కేరళలోని కరక్కోణం ప్రాంతంలోని బలరామపురం. కరక్కోణంలోని ఓ ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందటే శాఖా కుమారి అనే మహిళను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు (అతడి భాషలో). శాఖా కుమారిది త్రెస్యాపురం. కుమారిని పెళ్లి చేసుకోవడానికి ముందు అరుణ్ ఆమెతో కొంత కాలం డేటింగ్ చేశాడు. ఆమెది సంపన్న కుటుంబం. త్రెస్యాపురంలో ఆమె కుటుంబానికి ఎకరాలకొద్ది భూమి ఉంది. చాలా డబ్బు ఉంది. అరుణ్‌కు ఆమె అతడి తల్లి ద్వారా పరిచయమైంది. అరుణ్ తల్లికి ఆమె మంచి మిత్రురాలు. అవును.. మీ అనుమానం నిజమే.. తల్లికి ఫ్రెండ్ అంటే ఆమె వయసు 50 ఏళ్లకు పైగా ఉండొచ్చుగా.. అంతే.. శాఖా కుమారి వయసు 51 ఏళ్లు. కుమారిని పెళ్లి చేసుకుంటే ఆమె ఆస్తినంతా కొట్టేయొచ్చనేది అరుణ్ ప్లాన్. ఆమెకు మాయమాటలు చెప్పాడు. పెళ్లికి ఒప్పించాడు. కరోనా వైరస్ నెపంతో అతి కొద్ది మంది సమక్షంలో ఆమె మెడలో తాళి కట్టాడు. వివాహం తర్వాత శాఖా కుమారి సంతోషం రెట్టింపైంది. అరుణ్ ఉద్యోగ నిమిత్తం ఇంట్లోంచి వెళ్లగానే కుమారి తన బంధువులు, కావాల్సిన వాళ్లకు ఫోన్ చేసి తన పెళ్లి గురించి చెప్పుకునేది. పెళ్లి ఫోటోలను పంపించేది. కుమారి అలా చేయడం అరుణ్‌కు కోపం తెప్పించింది. ఎందుకంటే అరుణ్ ఆమెను పెళ్లి చేసుకున్న విషయం బయటి ప్రపంచానికి తెలియడం అతడికి అస్సలు ఇష్టం లేదు. ఆమెను పెళ్లి చేసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందిగా. అది బయటపెట్టలేడు. కుమారితో గొడవకు దిగాడు. చెడామడా తిట్టేశాడు. పెళ్లి తర్వాత అతడి ప్రవర్తన మారిపోయిందని కుమారి కూడా కడిగి పారేసింది. దీంతో అరుణ్ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కుమారి వల్ల తన పరువు పోయేట్లు ఉందని భావించిన అరుణ్ ఆమెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా తనకు తెలిసిన విద్యతోనే ప్రణాళిక అమలు చేశాడు. కుమారిని సంతోష పెట్టడానికి తీసుకున్న డెకరేటివ్ లైట్ వైర్లతోనే ఆమెకు కరెంట్ షాక్ కొట్టేలా చేశాడు. అతడి ప్లాన్ వర్కవుట్ అయింది. విద్యుత్ షాక్‌తో ఆమె మరణించింది. ఆ తర్వాత తన నటన మొదలుపెట్టాడు. అది వికటించి కటకటాల పాలయ్యాడు. అరుణ్ తన తల్లిని కూడా కన్వీన్స్ చేసి కుమారిని పెళ్లి చేసుకున్నాడు. కుమారి చనిపోతే మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఆస్తితో అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చని బహుశా ఆమెకు కూడా చెప్పుంటాడు. అయితే.. కుమారి చనిపోతే ఆ ఆస్తి మొత్తం అరుణ్‌కు దక్కుతుంది. కానీ, చంపితే... అరుణ్ హంతకుడు అవుతాడు. ఈ చిన్న లాజిక్ మిస్సయ్యాడు కదూ..!


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mVZDVA

Post a Comment

0 Comments