జనసేనకు షాక్.. భారీగా ట్విట్టర్ ఖాతాలు సస్పెండ్

పార్టీకి చెందిన దాదాపు 300 ట్విట్టర్ ఖాతాలు సస్సెండ్ అయ్యాయి. జనసేనకు మద్దతుగా పని చేసే, శతఘ్ని టీంకు చెందిన ట్విట్టర్ ఖాతాలను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. జనసేన శ్రేణులు గత కొద్ది రోజులుగా ట్విట్టర్లో సేవ్ నల్లమల క్యాంపెయిన్ చేస్తున్నాయి. అలాగే వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అనే క్యాంపెయిన్‌ను కూడా షురూ చేశాయి. సేవ్ నల్లమల క్యాంపెయిన్‌ కారణంగా ట్విట్టర్ తమ ఖాతాలను సస్పెండ్ చేసే అవకాశం లేదని.. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ పనే కావచ్చని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. జగన్ తనకు నచ్చని న్యూస్ ఛానెళ్లను, ట్విట్టర్ ఖాతాలను నిషేధిస్తున్నారని.. మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని.. కొందరు జనసైనికులు ఆరోపిస్తున్నారు. జనసేనను చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతోందని ట్వీట్లు చేస్తున్నారు. జనసేన సోషల్ మీడియా ఖాతాలను మళ్లీ పని చేసేలా చూద్దామని పిలుపునిస్తున్నారు. టీడీపీ శ్రేణులు కూడా వైఎస్ జగన్ ఫెయిల్డ్ సీఎం అని ప్రచారం చేస్తున్నాయి. కానీ జనసేన ఖాతాలు మాత్రమే సస్పెండ్ కావడం గమనార్హం. మా ట్విట్టర్ ఖాతాలను సస్పెండ్ చేయించినంత మాత్రాన జనసేన గొంతు మూగబోతుందా..? 300 ఖాతాలను సస్పెండ్ చేస్తే 3000 ఖాతాలు పుట్టుకొస్తాయని జనసైనికులు ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రధాన మీడియాలో పవన్ కళ్యాణ్ వార్తలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన అభిమానులు జనసేనకు సంబంధించిన వార్తలను ఫార్వర్డ్ చేయడంలో ముందుంటారు. దీంతో భారీ ఫాలోవర్లు ఉన్న ఖాతాలు సస్పెండ్ కావడం జనసేనకు తాత్కాలికంగానైనా దెబ్బే.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2AqtaRt

Post a Comment

0 Comments