రాయలసీమ ప్రాంతంలో ఎడతెగని రీతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో కురుస్తోన్న వర్షాల కారణంగా మహనంది ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు వచ్చి చేరింది. పంచలింగల మండపంలోకి సైతం వరద వచ్చింది. భారీగా వరద ప్రవాహం చుట్టుముట్టడంతో.. ఆలయంలోకి భక్తులను వెళ్లనీయడం లేదు. పుజాధికాలను సైతం నిలిపేశారు. మహానందిలోని ఉన్న మూడు పుష్కరిణిలు గతంలో ఎన్నడూలేని రీతిలో నిండిపోయాయి. బయటి ద్వారం నుంచి నీరు బయటకు ప్రవహిస్తోంది. ఆలయ పరిసర ప్రాంతాలు వరద గోదావరిని తలపిస్తున్నాయి. పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. నంద్యాల – మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 15 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో వర్షం కురిసింది. సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నల్లగట్ల-బత్తులూరు గ్రామాల మధ్య కడప-కర్నూలు జాతీయ రహదారి కోతకు గురైంది. శిరివెళ్ల మండలంలో ఆదివారం రాత్రి 227.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సిరివేళ్ళ, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ, దొరనిపాడు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34MwPXO
0 Comments