కశ్మీర్‌లో మరో ముగ్గురు ముష్కరులు హతం.. 36 గంటల్లో 11 మందిని మట్టుబెట్టిన సైన్యం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం మరింత ముమ్మరం చేసింది. కేవలం 36 గంటల వ్యవధిలోనే మూడు వేర్వేరు ఆపరేషన్లలో 11 మంది ముష్కరులను భద్రతా బలగాలు అంతం చేశాయి. శుక్రవారం షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు, శనివారం తెల్లవారుజామున పుల్వామాలో మరో నలుగుర్ని సైన్యం మట్టుబెట్టింది. తాజాగా, శనివారం అర్ధరాత్రి తర్వాత శ్రీనగర్‌ శివారులోని పంతన్ చౌక్ వద్ద ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమవ్వగా.. ఓ పోలీస్ అధికారి వీర మరణం పొందాడు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోన్నట్టు అధికారులు వెల్లడించారు. పంతన్ చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్న సైన్యం.. నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో అప్రమత్తమైన సైన్యం.. ఎదురు కాల్పులు ప్రారంభించిందని అధికారులు తెలిపారు. రాత్రంతా నిర్బంధ తనిఖీలు కొనసాగగా.. తెల్లవారుజామున కాల్పులు ప్రారంభించినట్టు తెలిపారు. తాజా ఘటనలో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టామని, జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఏఏస్ఐ బాబూ రామ్ ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడయ్యాడని పేర్కొన్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుండగా.. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని అన్నారు. శుక్రవారం షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. వీరిలో ఒకరు జమ్మూ కశ్మీర్ పోలీస్ విభాగంలో పనిచేసిన కానిస్టేబుల్ ఉన్నాడు. గతంలో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేసి.. టెర్రరిస్ట్‌గా మారిన షాకూర్ అహ్మద్ పర్రే కూడా ఈ కాల్పుల్లో చనిపోయినట్లు గుర్తించారు. షాకూర్ అహ్మద్ నాలుగున్నరేళ్ల క్రితం అనంతనాగ్ జిల్లాలోని బిజ్బేహర పోలీస్ స్టేషన్ నుంచి నాలుగు ఏకే-47 తుపాకీలతో పరారయ్యాడు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2EKDU2A

Post a Comment

0 Comments